కర్ణాటక రాష్ట్ర హైకోర్టు సంచలన వ్యాఖ్యలు చేసింది. ఆర్సీబీ విజయోత్సవ వేడుకల్లో చోటు చేసుకున్న తొక్కిసలాట దేశ వ్యాప్తంగా కలకలం రేపింది. ఈ ఘటనలో 11 మంది ప్రాణాలు కోల్పోగా 50 మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారు. వీరంతా ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ ఘటనపై సుమోటోగా తీసుకుంది కోర్టు. తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ప్రభుత్వం ఏం చేస్తోందంటూ నిలదీసింది. ఒక బాధ్యత కలిగిన సర్కారేనా ఇది అని మండిపడింది.
ఓ వైపు ఊపిరి ఆడక ఇబ్బంది పడుతుంటే ఇంకో వైపు స్టేడియంలో ఎలా సన్మానాలు చేస్తారంటూ ప్రశ్నించింది. ఇందుకు సంబంధించి పూర్తి నివేదికను తక్షణమే కోర్టుకు సమర్పించాలని ఆదేశించింది . ఈ సంఘటనపై మంగళవారం నాటికి వివరణాత్మక స్థితి నివేదికను ఇవ్వాలని నోటీసులు జారీ చేసింది. పరిపాలనా లోపాలు స్పష్టంగా కనిపించాయని కోర్టు వ్యాఖ్యానించింది. తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. 5 వేల మంది పోలీసులు బందోబస్తు చేపట్టారని, కానీ ఆశించిన దానికంటే ఎక్కువగా అభిమానులు హాజరయ్యారని ఈ సందర్బంగా వెల్లడించారు సీఎం సిద్దరామయ్య.
విచారణకు ఆదేశించామని తెలిపారు. చనిపోయిన వారి కుటుంబాలకు ఒక్కొక్కరికి రూ. 10 లక్షలు పరిహారంగా ఇస్తున్నట్లు ప్రకటించారు. ఈ మొత్తం వ్యవహారంపై సంచలన కామెంట్స్ చేసింది ధర్మాసనం. ప్రజల ప్రాణాలను పణంగా పెట్టి ఉత్సవాలను నిర్వహించడం, పరేడ్ లను నిర్వహించాలని అనుకోవడం దారుణమని పేర్కొంది ధర్మాసనం. ఇలాంటివి పునరావృతం కాకుండా చూడాలని ఆదేశించింది.