అమరావతి – గత జగన్ రెడ్డి సర్కార్ విద్యా వ్యవస్థను నిర్వీర్యం చేసిందని ఆరోపించారు మంత్రి నారా లోకేష్. గతి తప్పిన శాఖను గాడిలో పెట్టేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నామని చెప్పారు. అన్ని వ్యవస్థలను పక్కదారి పట్టించారని మండిపడ్డారు. కూటమి సర్కార్ కొలువు తీరాక ఇచ్చిన ఆరు గ్యారెంటీలను అమలు చేయడంపై ఫోకస్ పెట్టామన్నారు. తాము వచ్చిన వెంటనే మెగా డీఎస్సీని నిర్వహిస్తు న్నామన్నారు. గతంలో పని చేసిన విద్యా శాఖ మంత్రికి బేసిక్స్ కూడా తెలియవన్నారు.
ఇదే సమయంలో తల్లికి వందనం ఇచ్చిన మాట ప్రకారం అమలు చేయడం జరిగిందన్నారు. 17 లక్షల మందికి పైగా తల్లులకు వారి ఖాతాల్లో నిధులను జమ చేసినట్లు స్పష్టం చేశారు. అంగన్వాడీకి వెళ్లే LKG, UKG పిల్లలకు తల్లికి వందనం పథకం వర్తించదన్నారు. స్థూల నమోదు నిష్పత్తి (GER) చూపించేందుకు గత ప్రభుత్వం ఏకంగా 18 ఏళ్లు కంటే ఎక్కువ వయసు ఉన్న వాళ్లను ప్రభుత్వ పాఠశాల విద్యార్థులుగా చూపించిందని సంచలన ఆరోపణలు చేశారు.
పక్క రాష్ట్రంలో చదువుతున్న వాళ్లను ఏపీలో చదువుతున్నట్లు చూపించారని పేర్కొన్నారు. దీనికి సంబంధించిన అన్ని ఆధారాలు తన దగ్గర ఉన్నాయన్నారు నారా లోకేష్. వన్ క్లాస్ వన్ టీచర్ మోడల్ తీసుకొస్తున్నాంమని ప్రకటించారు. ఇప్పటి వరకూ 1200 స్కూల్స్ లోనే ఈ విధానం ఉందన్నారు. ఇప్పుడు 9600 పాఠశాలల్లో వన్ క్లాస్ వన్ టీచర్ అమలు చేస్తున్నామన్నారు. విద్య వ్యవస్థలో సంస్కరణలకు శ్రీకారం చుట్టామన్నారు మంత్రి.