హైదరాబాద్ – తెలంగాణ ఇప్పుడు దేశంతో కాదు అభివృద్ధి చెందిన దేశాలతో పోటీ పడుతోందన్నారు ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క. ఇనిస్టిట్యూట్ ఆఫ్ చార్టెడ్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా (ICAI) హైదరాబాద్ శాఖ ఆధ్వర్యంలో శిల్పకళావేదికలో జరిగిన CA విద్యార్థుల జాతీయ సదస్సులో ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. రాష్ట్ర అభివృద్ధి, యువత భవిష్యత్, చార్టెడ్ అకౌంటెంట్ వృత్తి విలువలపై కీలక వ్యాఖ్యలు చేశారు.
తెలంగాణను ఫ్యూచర్ సిటీగా తీర్చిదిద్దే దిశగా పని చేస్తున్నామని చెప్పారు డిప్యూటీ సీఎం. మూసీ పునరుత్థానం, రీజినల్ రింగ్ రోడ్ వంటి ప్రాజెక్టులపై వేగంగా ప్రభుత్వం చర్యలు చేపట్టిందని అన్నారు.
తెలంగాణలో IT, ఫార్మా, టెక్స్టైల్స్, ఆర్టిఫిషల్ ఇంటెలిజెన్స్, స్టార్టప్లకు అపార అవకాశాలు ఉన్నాయని పేర్కొన్నారు. CAలు దేశ ఆర్థిక శక్తికి మార్గ నిర్దేశకులు కావాలని పిలుపునిచ్చారు. మీ నిజాయితీ మీ విలువైన ఆస్తి అదే మీ నిజమైన మూల ధనం అని స్పష్టం చేశారు.
CAలు కేవలం బ్యాలెన్స్ షీట్లు మాత్రమే కాకుండా దేశ అభివృద్ధిలో భాగస్వాములు కావాల్సిన అవసరం ఉందన్నారు. సమకాలీన పరిజ్ఞానం, సామాజిక బాధ్యతలతో ముందుకు వెళ్లాలని అన్నారు మల్లు భట్టి విక్రమార్క.. ఉద్యోగాలు వెతకకండి ఉద్యోగాలు సృష్టించాలని కోరారు. సీఏ వృత్తిని ఎంచుకున్నందుకు ప్రత్యేకంగా అభినందనలు తెలియ చేశారు.